గీత దాటితే వేటు తప్పదు.. కలెక్టర్ ఇలా త్రిపాఠి వార్నింగ్
నిజామాబాద్, మార్చి 23 : విధి నిర్వహణలో ఎవరైనా కావాలని నిర్లక్ష్యానికి తావిస్తే, కేవలం సస్పెన్షన్ తోనే సరిపెట్టకుండా బాధ్యులైన వారిపై మరింత కఠిన చర్యలు చేపడతామని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇటీవల పదవ తరగతి పరీక్షల సందర్భంగా ఎస్జీటీ ఉపాధ్యాయుడు వ్యవహరించిన తీరును కలెక్టర్ ప్రస్తావిస్తూ పైవిధంగా హెచ్చరికలు చేశారు. ఎంతో బాధ్యతాయుతమైన విధుల్లో కొనసాగుతూ, విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించడం శోచనీయమని అన్నారు. ఈ తరహా నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, నిర్లక్ష్యానికి తావిచ్చే వారిపై తప్పనిసరిగా కఠినమైన చర్యలు ఉంటాయని కరాఖండీగా తేల్చి చెప్పారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పక్కాగా వ్యవహరించాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ తో పాటు సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసిల్దార్లు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలోకి సిబ్బంది ఎవరూ సెల్ ఫోన్లు ...