భాషకు ప్రాణం పోసిన అక్షర సేనాని... తెలిదేవర భానుమూర్తికి కన్నీటి వీడ్కోలు
తెలంగాణ మట్టి వాసనను, ఆ భాషా సౌందర్యాన్ని హిమాలయమంత ఎత్తున నిలబెట్టిన నా ఆత్మీయ మిత్రుడు తెలిదేవర భానుమూర్తి (73) గారు మల్కాజ్గిరిలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారన్న వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అక్షరం ముక్కలైనట్లు, ఒక భాషా నిధి కనుమరుగైనట్లు నా మనసు విలపిస్తోంది. తెలంగాణ భాషకు అస్తిత్వ శిఖరం హైదరాబాద్ గల్లీల్లో వినిపించే సామాన్యుడి గొంతును, ఆ భాషలోని నుడికారాన్ని ప్రపంచ యవనికపై సగర్వంగా నిలబెట్టిన ఘనత ఆయనది. కేవలం రచనలు చేయడం మాత్రమే కాదు, తెలంగాణ యాసను, ఆ అస్తిత్వాన్ని తన ఊపిరిగా మలచుకున్న నిఖార్సైన కవి, జర్నలిస్ట్ ఆయన. 1995లో 'వార్త' తెలుగు దినపత్రిక ఆరంభంలో నిజామాబాద్ ఎడిషన్లో మా ప్రయాణం మొదలైంది. సీనియర్ సంపాదకులు ఏబీకే ప్రసాద్ గారి సారథ్యంలో... భానుమూర్తి ఎడిషన్ ఇన్ఛార్జిగా, నేను ఎడిషన్ చీఫ్గా కలిసి అడుగులు వేశాం. "పత్రికా భాష అంటే కేవలం ఒక ప్రాంతానిదే కాదు, అది ప్రజల భాష కావాలని కలలు గన్న సాహితీ మూర్తి ఆయన." ఆ రోజుల్లో వార్తాపత్రికలపై ఒకే తరహా ఆంధ్ర భాషా ఆధిపత్యం నడుస్తున్న తరుణంలో, తెలంగాణ వాడుక భాషను వార్తా రచనలోకి తెచ్చిన సా...