కోటగల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం ఘన విజయం – వందలాది మందికి పరీక్షలు
నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ప్రాంతంలో ఉన్న పద్మశాలి సంఘం తర్ప నెం.3 ప్రాంగణంలో ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డా. బొద్దుల రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం (08-03-2026) ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన ఈ వైద్య శిబిరంలో వందలాది మంది కాలనీ వాసులు పాల్గొని తమ కంటి సమస్యలకు సంబంధించిన పరీక్షలు చేయించుకున్నారు. ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు చెందిన అనుభవజ్ఞులైన కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ వనిత (MBBS, DO (OSM), DNB, ఫాకో సర్జన్) రోగులకు సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించి తగిన వైద్య సలహాలు అందించారు. అవసరమైన వారికి తదుపరి చికిత్సల గురించి కూడా వివరించారు.
ఈ సందర్భంగా డా. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సమాజ సేవలో భాగంగా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ముఖ్యంగా కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
డాక్టర్ వనిత మాట్లాడుతూ కంటి ఆరోగ్యం మన దైనందిన జీవితంలో అత్యంత ముఖ్యమని, సమయానికి పరీక్షలు చేయించుకుంటే అనేక కంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించవచ్చని తెలిపారు.
కోటగల్లిలోని బంగారు మైసమ్మ మందిరం ఎదురుగా నిర్వహించిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం కావడంతో స్థానిక ప్రజలు, పద్మశాలి సంఘం సభ్యులు నిర్వాహకులను అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని కోరారు.