ఏసీ రూములు వదిలి జనం బాట పట్టండి.. ఇంచార్జి మంత్రి సీతక్క
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యక్రమం ఒక యజ్ఞంలా ప్రారంభమైందని ఇంచార్జి మంత్రి సీతక్క చెప్పారు.
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో ఉన్నత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు ఆమె.
ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి
అధికారులకు ,ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు
రాబోయే 99 రోజులు అత్యంత కీలకమని, ప్రతి అధికారి ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు.
ఏసీ గదులకే పరిమితం కాకుండా, అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవాలని సూచించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడటమే ఈ 'ప్రగతి ప్రణాళిక' ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.
ఉమ్మడి జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి నిజామాబాద్ను అభివృద్ధిలో నంబర్ వన్గా నిలపాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ
అభివృద్ధిలో రాజీ పడొద్దని,
ఉమ్మడి జిల్లాలో పెండింగ్లో ఉన్న తాగు నీటి ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణాలు , మౌలిక సదుపాయాల పనులను ఈ 99 రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను కోరారు.
వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి కోసం ఉద్దేశించిన పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు.
జిల్లాలో ఉన్న వనరులను ఉపయోగించుకుని కొత్త పరిశ్రమల స్థాపనకు, తద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు షబ్బీర్.
ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు తమ ప్రాంతాల్లో అమలు సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

