షబ్బీర్ భాయ్ కళ్ళు చెమ్మగిల్లిన వేళా...
కామారెడ్డి,
ముగ్గురు చిన్నారుల హత్య ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి గురైనారు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ. కామారెడ్డి పట్టణంలో జరిగిన హృదయ విదారక ఘటన అందరినీ కలచివేసింది. కన్నతండ్రే కాలయముడై అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులు షిఫత్, ఆయాత్, మరియం లను చెరువులో పడేసి హత్య చేసిన ఘటన పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఈ అమానుష ఘటన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీని తీవ్రంగా కలిచివేసింది.
ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే షబ్బీర్ అలీ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తన ముగ్గురు బిడ్డలను కోల్పోయి విలపిస్తున్న తల్లిని చూసి ఆయన కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఆమెను ఓదార్చుతూ ధైర్యం చెప్పే సమయంలో ఆయన కళ్లు చెమ్మగిల్లాయి.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఒక మనిషి ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తాడు? కన్నబిడ్డలను చంపుకోవడానికి మనసెలా ఒప్పింది? ఇది కేవలం ఒక కుటుంబానికి జరిగిన అన్యాయం కాదు, మానవత్వానికే తలవంపులు అని ఆవేదన వ్యక్తం చేశారు.
మన చుట్టుపక్కల ఎవరైనా ఆకలితో అలమటిస్తుంటే ,ఆర్థిక ఇబ్బందులు ఉంటే మనకు తోచినంత సహాయం చేస్తే ఇలాంటి సంఘటనలను మనం అడ్డుకోవచ్చు అన్నారు.
బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందిస్తూ ఆయన పలు హామీలు ఇచ్చారు.
ఆ తల్లికి జీవనోపాధి కోసం కాంట్రాక్ట్ ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు.
నిందితుడికి కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.షబ్బీర్ అలీ చూపిన మానవతా దృక్పథం పట్ల స్థానికుల ప్రశంసిస్తున్నారు.