నిజామాబాద్లో ధాన్యం కొనుగోలు భారీ ప్లాన్ 🌾 9 లక్షల టన్నులు సేకరణ!
నిజామాబాద్, యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అంకితభావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆదేశించారు. రైతులు ఎక్కడ కూడా ఏ దశలోనూ ఇబ్బందులు పడకుండా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలని అన్నారు. రబీ వరి ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో మంగళవారం ఆయా శాఖల అధికారులతో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈఓలు, ఐకెపి సీసీలు, మెప్మా ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉంచేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో యాసంగిలో 4.27 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారని అన్నారు. సుమారు 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేయగా, 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 669 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తిస్థాయిలో మద్దతు ధర పొందేలా క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలోనూ రైతులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పంట విక్రయం విషయంలో రైతులు ఇబ్బందులకు గురికాకుండా, పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా కేంద్రాల వద్ద తగిన నీడ, నీటి వసతి కల్పించాలన్నారు. సరిపడా సంఖ్యలో తేమ కొలిచే యంత్రాలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా తూకం, తరుగు వంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని, ధాన్యం సేకరణ ముగిసేంత వరకు పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయి మద్దతు ధర అందేలా చూడాల్సిన గురుతర బాధ్యత అధికారులపై ఉందన్నారు. అధికారులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ కొనుగోళ్ల ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ చేయాలని, ఏమైనా సమస్యలు గమనించిన వెంటనే వాటిని పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. రైతుల నుండి ధాన్యం సేకరించిన వెంటనే టాబ్ ఎంట్రీలు జరపాలని, తద్వారా వారికి త్వరితగతిన చెల్లింపులు జరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. బిల్లుల చెల్లింపుల్లో అనవసర తప్పిదాలకు పాల్పడుతూ, నిర్లక్ష్యానికి తావిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
సంబంధిత శాఖల అధికారులందరూ సమిష్టిగా, సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. రైతుల నుండి ఏ చిన్న ఫిర్యాదు సైతం రాకుండా చూసుకోవాలని, ధాన్యం సేకరణలో క్షేత్రస్థాయి అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. ముఖ్యంగా ధాన్యం రవాణాకు సరిపడా సంఖ్యలో వాహనాలను సమకూర్చుకోవాలని, ధాన్యం ఎగుమతులు, దిగుమతులు వెంటదివెంట జరిగేలా అవసరమైన సంఖ్యలో హమాలీలు ఏర్పాటు చేసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిలువ చేసేందుకు తగిన ప్రదేశాలను గుర్తించాలని సూచించారు.
నాణ్యతా ప్రమాణాలను సాకుగా చేసుకుని రైతులను నష్టపర్చే ప్రయత్నాలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, రైతుల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశమైనందున ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని అధికారులకు హితవు పలికారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులను అన్ని కేంద్రాలకు సమకూరుస్తామని, 2.25 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం అవుతాయని అంచనా వేశామని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటదివెంట రైస్ మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి పాల్గొన్నారు.


Follow Our WhatsApp Channel