ఆదానీకి అమ్మేసి సుద్దపూస మాటలా?
ఎంపీ అరవింద్పై కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి విమర్శలు
Nizamabad: జిల్లాకు గత పది సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి సాధించారో చెప్పకుండా ఈనెల 21న “చలో కలెక్టరేట్” కార్యక్రమం చేపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఎంపీ Dharmapuri Arvind పై విమర్శలు గుప్పించారు.
బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ అరవింద్కు జిల్లా అభివృద్ధిపై, ముఖ్యంగా రైతాంగంపై ఎలాంటి శ్రద్ధ లేదని ఆరోపించారు. రైతుల పేరుతో రాజకీయాలు చేస్తున్నారే తప్ప అభివృద్ధిలో మాత్రం శూన్యం అని విమర్శించారు.
పసుపు బోర్డు ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్నా, పసుపు రైతులకు కనీస మద్దతు ధర కూడా లభించడం లేదని, మార్కెట్ యార్డుల్లో రైతులు ధర పెంపు కోసం ఆందోళనలు చేస్తున్నప్పటికీ ఎంపీ స్పందించడం లేదన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో మొక్కజొన్నకు మద్దతు ధర ఇవ్వాలంటూ కలెక్టరేట్ ముట్టడి చేపడతామని చెప్పడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పసుపు రైతుల గురించి పెద్ద ఎత్తున మాట్లాడిన అరవింద్ ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టారని ప్రశ్నించారు.
జిల్లాలో ఎప్పుడూ రాజకీయ రగడలు సృష్టిస్తూ అమాయక ప్రజలను రెచ్చగొట్టడం ఆయనకు అలవాటుగా మారిందని నగేష్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికే ఎంపీ అసలు స్వరూపం పసుపు రైతులకు తెలిసిపోయిందని అన్నారు.
మాధవ నగర్ ఆర్ఓబి వంటి కీలక అభివృద్ధి పనులు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని, వాటిని పూర్తి చేయడంలో కూడా ఎంపీ విఫలమయ్యారని మండిపడ్డారు.
జిల్లా ప్రజలను పండుగ సమయంలో కూడా ప్రశాంతంగా ఉంచకుండా రాజకీయ కార్యక్రమాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని నగేష్ రెడ్డి ఆరోపించారు.
